పరిశ్రమల భద్రతకు సమన్వయం కీలకం: డీసీపీ ఎన్. కోటి రెడ్డి
జీడిమెట్ల (న్యూస్ విధాత్రి), మార్చి 12: పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగులు కలిసి పనిచేసినప్పుడే భద్రతా ప్రమాణాలు మెరుగుపడతాయని, సమర్థవంతమైన భద్రతా నిర్వహణకు పరస్పర సహకారం, సమన్వయం కీలకమని కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి పేర్కొన్నారు. జీడిమెట్ల ఎస్హెచ్వో గడ్డం మల్లేశ్ అన్ని శాఖలను సమన్వయం చేసి జీడిమెట్లలోని ఇండస్ట్రియల్ అసోసియేషన్ భవనంలో పారిశ్రామిక భద్రతా సమన్వయ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ప్రమాద రహిత పరిశ్రమలను ప్రోత్సహించడం, కార్మికులకు భద్రమైన పని వాతావరణం కల్పించడం లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ఫ్యాక్టరీ యజమానులు, భద్రతా అధికారులు, నిపుణులు పాల్గొన్నారు. పరిశ్రమల్లో అమలు చేయాల్సిన సమర్థవంతమైన భద్రతా చర్యలు, ఉత్తమ పద్ధతులు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే నియమ నిబంధనల పాటించడం, బలమైన రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం అత్యంత అవసరమని తెలిపారు. పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, భద్రతా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పీసీబీ ఈఈ రాజేందర్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ మధు, కుత్బుల్లాపూర్ ఏసీపీ బాలగంగి రెడ్డి, విద్యుత్ ఏడిఈలు వీరేశం, ప్రేమ్ కుమార్, స్టేషన్ ఫైర్ అధికారి శేఖర్ రెడ్డి, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ నితిన్, జీడిమెట్ల పరిశ్రమల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రంగా రాజు, ఐలా చైర్మన్ పీడీఎస్ఎన్ రాజు, హైడ్రా ఇన్స్పెక్టర్, వివిధ కంపెనీలకు చెందిన సుమారు 250 మంది పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు హాజరయ్యారు.