దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
• నిన్న చింతల్ సర్కిల్లో… నేడు దుండిగల్ సర్కిల్లో..
• వరుస తనిఖీలతో కుత్బుల్లాపూర్ జోన్ లో అప్రమత్తం
• అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని విచారిస్తున్న ఏసీబీ అధికారులు
దుండిగల్ (న్యూస్ విధాత్రి), ఫిబ్రవరి 18: జిహెచ్ఎంసి కుత్బుల్లాపూర్ జోన్ పరిధి దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. సర్కిల్ ఉప కమిషనర్ వెంకటేష్ నాయక్ తో సహా ఏకకాలంలో సర్కిల్ పరిధిలోని అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
సర్కిల్ పరిధిలో ఇటీవల ఇచ్చిన భవన నిర్మాణ అనుమతులతో పాటు వివిధ విభాగాల్లోని రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లను సైతం విచారిస్తూ పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
ఎసిబి అధికారులు వరుసగా మంగళవారం చింతల్ సర్కిల్ పరిధిలో నిర్వహించగా, బుధవారం దుండిగల్ సర్కిల్లో సోదాలు నిర్వహిస్తుండడంతో కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని ఇతర సర్కిళ్ల లోని అధికారులు, సిబ్బంది లో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడెప్పుడు ఆయా సర్కిలలో తనిఖీలు నిర్వహిస్తానని ప్రజలు చర్చించుకుంటున్నారు.