విలేకరిని బెదిరించిన కల్లు కాంపౌండ్ నిర్వాహకులు
• కేసు నమోదు చేసిన దుండిగల్ పోలీసులు
దుండిగల్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 25 : దమ్ముంటే ఇక్కడికి రా.. నువ్వు వస్తావా… లేక మమ్మల్నే రమ్మంటావా… మా పైనే వ్యతిరేక వార్తలు రాస్తావా.. నీ సంగతి ఏంటో చూస్తాం… అంటూ దుండిగల్ మున్సిపల్ స్థలంలో ఏర్పాటు చేసిన కల్లు కాంపౌండ్ పై వార్త రాసిన ఓ విలేకరిపై ఫోన్ లో బెదిరింపులకు దిగిన సంఘటన దుండిగల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం… దుండిగల్ మున్సిపల్ పరిధి లోని మున్సిపల్ కు సంబంధించిన స్థలంలో ప్రస్తుత నిబంధనల ప్రకారం కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా అతి తక్కువ అద్దె చెల్లిస్తూ దుండిగల్ కు చెందిన లద్దిపీర్ల బిక్షపతి గౌడ్, అతని సోదరుడు లబ్దిపీర్ల నరసింహారావు గౌడ్ కల్లు కాంపౌండ్ ను నిర్వహిస్తున్నారు. ఇదే విషయంపై ఈనెల 22వ తేదీన కే. రాజు అనే విలేకరి సదరు కల్లు కాంపౌండ్ పై వార్త రాశాడు. దీంతో దుండిగల్ కమిషనర్ కల్వకుంట్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో కల్లు కాంపౌండ్ వద్ద మున్సిపల్ స్థలం అనే సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.

దీనిని జీర్ణించుకోలేకపోయినా కల్లు కాంపౌండ్ నిర్వాహకులు వార్త రాసిన విలేకరికి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో ఇష్టానుసారం విరుచుకుపడ్డారు. అంతేకాకుండా నీ అంత చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో కుత్బుల్లాపూర్ లోని విలేకరులు తమ సహచరుడికి వచ్చిన బెదిరింపు కాల్ ను ఖండిస్తూ.. మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి కలిసి బెదిరింపులకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రాన్ని అందజేస్తారు. బెదిరింపులకు పాల్పడిన ఆడియో రికార్డును విని స్పందించిన డిసిపి బెదిరింపులకు పాల్పడిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మేడ్చల్ డివిజన్ ఎసిపి శ్రీనివాస్ రెడ్డి, దుండిగల్ సిఐ సతీష్ లను ఆదేశించారు. ఈ మేరకు బాధిత వర్కింగ్ జర్నలిస్ట్ రాజు అందించిన ఫిర్యాదు మేరకు బెదిరింపులకు పాల్పడిన కల్లు కాంపౌండ్ నిర్వాహకులపై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీష్ తెలిపారు.