ఎస్ఎస్ఆర్-2026 పకడ్బందీ కోసం శిక్షణా తరగతులు
• కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో బిఎల్వో లకు శిక్షణ
• ఈ నెల 17వ తేదీ వరకు జరగనున్న శిక్షణ తరగతులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 8: రానున్న ప్రత్యేక సమ్మరీ సవరణ (ఎస్ఎస్ఆర్) – 2026 లో నియోజకవర్గ ఓటర్ జాబితాను మరింత పటిష్టం చేసేందుకు బూత్ స్థాయి అధికారులు (బిఎల్వోలు), వారి సూపర్వైజర్లు కృషి చేయాలని ఉప కమిషనర్, ఈఆర్వో, వి. నర్సింహ సూచించారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో బిఎల్వో లకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన, కుత్బుల్లాపూర్ తహసిల్దార్, ఏఈఆర్వో సుజాతతో కలిసి మంగళవారం పాల్గొన్నారు.

నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరిని నూతన ఓటరు జాబితాలో చేర్చడం, మరణించిన వారిని జాబితా నుంచి తొలగించడంతో పాటు ఇతరత్రా మార్పులు, చేర్పులకు చర్యలు తీసుకోవాలని తెలపడంతో పాటు మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి అవగాహన కల్పించారు. వీటిపై ఎటువంటి అభ్యంతరాలు, అనుమానాలు తలెత్తిన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఈఆర్వో, ఏఈఆర్ లకు ఎన్నికల అధికారులు శిక్షణ కల్పించారని, అలాగే నియోజకవర్గంలో దుండిగల్, నిజాంపేట మున్సిపల్ పరిధిలోని బిఎల్వో లకు శిక్షణ తరగతులు పూర్తి చేశారని వారు తెలిపారు. కుత్బుల్లాపూర్ గాజులరామారం జంట సర్కిల్లో పరిధిలోని బిఎల్వోలకు రోజుకు 50 మంది చొప్పున ఈ నెల 17వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఈఆర్వో నర్సింహ తెలిపారు. ఈ శిక్షణా తరగతుల్లో ఏఎంసి కృష్ణ, ఎన్నికల సూపరిండెంట్ గిరిబాబు, బూత్ స్థాయి సూపర్వైజర్లు, బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.