ఓ పక్క తొలగిస్తున్నారు… మరో పక్క కడుతున్నారు..!
• సిబ్బంది హెచ్చరిస్తున్న పెడచెవిన పెడుతూ…
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జనవరి 30: ఫ్లెక్సీల రహిత జోన్ గా తీర్చిదిద్దేందుకు జిహెచ్ఎంసి కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఉన్న అక్రమ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ఈ మేర కుత్బుల్లాపూర్ కూడలిలో ఉన్న పలు ఫ్లెక్సీలను కూడా సిబ్బంది తొలగిస్తున్నారు.

కూడలిలో ఫ్లెక్సీలు కట్టేందుకు వీలుగా ఉన్న పలు సామాజిక వర్గాలతో పాటు వివిధ జెండాలను ఎగరవేసేందుకు ఏర్పాటుచేసిన ఇనుప పైపులను, వాటి దిమ్మలను కూడా తొలగించాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కుత్బుల్లాపూర్ కూడలిలో ఉన్న ఫ్లెక్సీలతో పాటు జెండా దిమ్మెలు, ఇనుప పైపులను కూడా సిబ్బంది తొలగించారు.

• పట్టింపు లేకుండా మరోవైపు ఏర్పాటు చేస్తున్న తీరు…
ఫ్లెక్సీల తొలగింపు వరకు అంతా బాగానే ఉన్నా… ఓ పక్క జిహెచ్ఎంసి సిబ్బంది ఫ్లెక్సీలను తొలగిస్తున్నట్లు కనిపిస్తున్న… అదేమీ వారికి పట్టనట్లు కూడలిలోని రోడ్డుకు మరోవైపు అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం వారి నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుంది. సిబ్బంది వారిని వారిస్తున్న తమకు ఫ్లెక్సీ కట్టేందుకు అనుమతి ఉందంటూ బుకాయిస్తూ ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి చెందిన ఫ్లెక్సీలు కట్టడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. మరి నిబంధనలకు విరుద్ధంగా, సిబ్బంది చెప్పిన వినకుండా ఫ్లెక్సీ కట్టిన వారిపై అధికారులు ఏ మేరకు జరిమానా విధించి, చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. అనంతరం సదరు ఫ్లెక్సీని సిబ్బంది తొలగించారు.

√ అనుమతి లేకుండా ఫ్లెక్సీలు కడితే చర్యలు తప్పవు.- శంకర్ సింగ్, జీడిమెట్ల సర్కిల్ ఉప కమిషనర్
ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలనుకునే వారు తప్పనిసరిగా జిహెచ్ఎంసి సంబంధిత అధికారుల వద్ద అనుమతులు తీసుకొని ఏర్పాటు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై భారీ జరిమానా తో పాటు తగిన చర్యలు తీసుకుంటాం.