కబ్జాదారుల కబంధ హస్తాలలో ప్రభుత్వ స్థలం
• దుండిగల్ సర్వేనెంబర్ 120/1 లోని ప్రభుత్వ స్థలంలో పాగా వేసిన కబ్జాదారులు
• ఇష్టానుసారంగా గదుల నిర్మాణాలు
• సుమారు 5 ఎకరాలు కొల్లగొట్టేందుకు యత్నం
• పట్టించుకోని రెవెన్యూ అధికారులు
• రెవెన్యూ అధికారుల అండదండలతోనే కబ్జాలంటూ వెల్లువెత్తిన విమర్శలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 7: దుండిగల్ రెవెన్యూ అధికారుల మౌనానికి ఎకరాల కొద్ది ఉన్న ప్రభుత్వ స్థలాలు స్వాహా అవుతున్నాయి. ప్రజల సొత్తైన ప్రభుత్వ భూములను దోచుకునేందుకు కొందరు కబ్జాదారులు వారికి సహకరించే కొందరు రెవెన్యూ అధికారులతో కలిసి వారి స్వలాభం కోసం ప్రభుత్వ భూములను కొల్లగొడుతూ కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నారు.
• దుండిగల్ సర్వేనెంబర్ 120/1 ప్రభుత్వ భూమిలో…
మేడ్చెల్ జిల్లా లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మండల పరిధి సర్వే నంబర్ 120/1 ప్రభుత్వ భూమి ప్రస్తుతం అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. సదరు స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ, కొంతమంది కబ్జాదారులు కోర్టు ఆదేశాల పేరుతో నిర్మాణాలు యదేచ్చగా కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం వల్ల ఈ తతంగం అంతా వారి కనుసన్నల్లోనే జరుగుతుందనే వాదన బలంగా వినిపిస్తుంది.

• 5 ఎకరాల ఆక్రమణ కనపడదా…?
ఒక పేద కుటుంబం 60 గజాల స్థలంలో ఉండడానికి ఇల్లు నిర్మిస్తే హడావిడి చేస్తూ కూల్చి వేస్తున్న రెవెన్యూ అధికారులకు మరి 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 50కి పైగా గదులు నిర్మించిన అధికారులకు కనిపించడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఆక్రమణ జరుగుతున్న అధికారులకు ఎటువంటి సంబంధం లేనట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకొని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, ప్రభుత్వ భూములను కాపాడే దిశగా నిర్దిష్ట విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.