కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
√ ముఖ్య అతిథిగా హాజరైన గ్రాండ్ మాస్టర్ వి. రవీందర్ కుమార్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జనవరి 25:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి సుచిత్రాలోని జై రామ్ నగర్ లో బి.ఆర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్ష కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహభరితంగా ఆదివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొని తమ కరాటే నైపుణ్యాలను ప్రదర్శించారు. విద్యార్థులు కరాటేలోని కటాస్, స్పైరింగ్, వివిధ టెక్నిక్స్తో పాటు ఆత్మరక్షణ పద్ధతులను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శిక్షణ పొందిన విద్యార్థుల ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ స్పష్టంగా కనిపించిందని నిర్వాహకులు తెలిపారు. గ్రేడింగ్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎల్లో బెల్ట్, ఆరెంజ్ బెల్ట్, పర్పుల్ బెల్ట్లతో పాటు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరాటే గ్రాండ్ మాస్టర్ వి. రవీందర్ కుమార్ మాట్లాడుతూ.. “కరాటే కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు. ఇది పిల్లల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, స్వీయ నియంత్రణను పెంపొందిస్తుంది. చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి” అని సూచించారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్ మార్షల్ ఆర్ట్స్ ఫౌండర్ రేవప్ప (రవి), కరాటే అన్వర్, జ్యోతిష్, మురళి, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై పిల్లలను ఉత్సాహంగా ప్రోత్సహించారు.