కుత్బుల్లాపూర్ లో ఘనంగా కాపు కార్తీక మాస వనభోజన మహోత్సవం
• ఏ సమస్య వచ్చినా కుటుంబ సభ్యుడిలా తోడుంటా – ఎంపీ
• నియోజకవర్గ కాపులంతా ఐకమత్యంగా ఉండాలి – మాజీ ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 26: కాపు కులస్తులకు ఏ సమస్య వచ్చినా కుటుంబ సభ్యుడిగా ముందు ఉంటానని మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. చింతల్ హెచ్ఎంటి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ మైదానంలో వంగవీటి మోహనరంగా (విఎంఆర్) కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ఎంతో ఉత్సాహంగా నిర్వహించిన కార్తీక మాస వనభోజన మహోత్సవంలో ఆయన, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ విడిపోయేటప్పుడు ప్రాంతాలుగా విభజించిన, మనమందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నామన్నారు. కార్తీకమాసం మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ పవిత్ర మాసంలో వనభోజనం చేయడం ప్రకృతికి దగ్గరగా ఉండడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య బంధాలను బలోపేతం చేస్తుంది. ఆధునిక జీవనశైలిలో ఈ తరహా సంప్రదాయాలను కొనసాగించడం మన బాధ్యత” అని ఎంపీ అన్నారు. ప్రతి సంఘంలో ధనికులతో పాటు పేదవారు కూడా ఉంటారని, అలాంటివారు ఏదైనా శుభకార్యాలతో పాటు ఇతరత్రా కార్యక్రమాలు చేసుకోవడానికి కమ్యూనిటీ హాళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. దానికోసం నియోజకవర్గంలో కబ్జాలకు గురి అవుతున్న ప్రభుత్వ స్థలాలను కాపాడి విశాలమైన కమ్యూనిటీ హాళ్ళకు కేటాయించాలా చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. సంఘం అంటే ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే ఆదుకునేదిలా ఉండాలని, దానికోసం సంఘ పెద్దలు పాటుపడాలని సూచించారు.

• కాపు కులస్తులంతా ఏకతాటిపై ఉండాలి.- శ్రీశైలం గౌడ్
అనంతరం మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ సాంప్రదాయం, స్నేహభావం, సామాజిక ఐక్యత కలయికగా వి ఎం ఆర్ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజన మహోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించడం ఆనందకరమన్నారు. కానీ.. కాపు కులస్తులంతా కలిసికట్టుగా ఏకతాటిపై ఉండి ముందుకు సాగాలన్నారు. ఒకే కులంలో రెండు వర్గాలుగా ఏర్పడి కార్యక్రమాలు నిర్వహించడం ఐక్యమత్యాన్ని దెబ్బతీయడమే కాకుండా కులాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని హితవు పలికారు. కుల పెద్దలందరూ చొరవ తీసుకొని వర్గ సాంప్రదాయానికి స్వస్తి పలికి కులస్తులంతా ఐక్యమత్యంతో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే యేడు కార్తీక మాస వన భోజన మహోత్సవాన్ని నియోజకవర్గంలోని కాపులంతా ఒకే వేదికగా నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు.

• కుల బాంధవ్యులను ఒకే వేదిక పైకి తీసుకురావడమే మా ధ్యేయం…
అనంతరం విఎంఆర్ కాపు సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ… కాపు సేవా సమితి ఎప్పుడూ సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, విద్యా, వైద్య సహాయ కార్యక్రమాల్లో ముందంజలో ఉంటుందన్నారు. కార్తీకమాస మన భోజనాల ద్వారా కుల బాంధవ్యులను ఒకే వేదికపైకి తీసుకురావడం తమ ఉద్దేశ్యమన్నారు. భవిష్యత్తులో కులస్తులనంత ఏకతాటిపైకి తెచ్చి భారీ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. కాపు కులస్తులంతా తమ తమ కుటుంబ సభ్యులు, మహిళలు, యువత, చిన్నారులతో కలిసి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వనభోజన కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన నిర్వాహకులకు, పాల్గొన్న వారికి సేవా సమితి సభ్యులు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, బిజెపి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎస్. మల్లారెడ్డి, బిజెపి నాయకులు గిరివర్ధన్ రెడ్డి, ముమ్మిడిశెట్టి వాసు, మాజీ డిసిసి అధ్యక్షుడు కేఎం. ప్రతాప్, కాపు నాయకులు మిరియాల రాఘవులు, తోట శివాజీ, వరప్రసాద్, విఎంఆర్ కాపు సేవా సమితి అధ్యక్షుడు విల్లా మూర్తి, కార్యనిర్వాక అధ్యక్షుడు చెన్నంశెట్టి కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు సనక వెంకటేశ్వరరావు, వేల్పూరి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి పులిగడ్డ నాగ కిషోర్, కోశాధికారి తోట రామ్మోహన్, సభ్యులు జగన్మోహన్ రావు, నాగరాజు, శ్రీనివాసరావు, నియోజకవర్గ కాపు కులస్తులు తదితరులు పాల్గొన్నారు.