సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శాలను యువత అనుసరించాలి. – ఎమ్మెల్యే వివేకానంద్
• సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా 3కే రన్
• మాదకద్రవ్యాల నిర్మూలన – రక్తదానం ప్రాధాన్యతపై యువతకు అవగాహన
• స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), నవంబర్ 2: దేశ ఏకీకరణకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శాలను యువత అనుసరించాలని, మాదకద్రవ్యాల వలన యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని, వాటికి యువత దూరంగా ఉండాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ అన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉదయం నిర్వహించిన 3కే రన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే, జీడిమెట్ల సిఐ గడ్డం మల్లేష్, డాక్టర్ కిరణ్ గ్రంధి, మోహన్ రావుతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల నిర్మూలన – ఆరోగ్యవంతమైన సమాజం, రక్తదానం – జీవదానం అనే నినాదాలతో ఈ రన్ను ఘనంగా నిర్వహించారు. పోలీసు ఇన్స్పెక్టర్ మల్లేష్ మాట్లాడుతూ..మాదకద్రవ్యాలు కేవలం వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాన్ని, సమాజాన్ని కూడా నాశనం చేస్తాయి. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగించాలి అని సూచించారు.

రక్తదానం వల్ల రక్తం అవసరం ఉన్న ఎంతోమంది జీవితాలు నిలబడుతున్నాయని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని డాక్టర్ కిరణ్ గ్రంధి అన్నారు. ఈ రకమైన అవగాహన కార్యక్రమాలు సమాజానికి దిశానిర్దేశంగా ఉంటాయని, ఇటువంటి కార్యక్రమాలు విరివిగా చూస్తూ ఉండాలని వారు సూచించారు. రన్ లో పాల్గొన్న అందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారు. అంతకుముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటం వద్ద ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జల్దా లక్ష్మీనాథ్, డైరెక్టర్ శ్రీకాంత్ యాదవ్, సభ్యులు మధుబాబు, నవీన్, తిమ్మయ్య, రాజు,విజయ్, వివిధ పాఠశాలల విద్యార్థులు, పోలీసులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.