ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. – ఈఆర్ఓ నర్సింహ
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జనవరి 23: ఓటు హక్కు విశిష్టతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి సద్వినియోగం చేసుకోవాలని కుత్బుల్లాపూర్ ఈఆర్ఓ వి. నర్సింహ సూచించారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జీడిమెట్ల సర్కిల్ కార్యాలయం వద్ద ఆయన అధికారులు, పౌరులతో ప్రతిజ్ఞను శుక్రవారం చేయించారు. భారతదేశ పౌరులైన తాము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఆయన వారితో ప్రతిజ్ఞ చేయించారు.

• సత్ జ్ఞాన్ పాఠశాలలో చిత్రలేఖనం పోటీలు…
ఈ సందర్భంగా వెంకటేశ్వర నగర్ లోని సత్ జ్ఞాన్ పాఠశాలలో ఓటు విశిష్టతపై విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలను వారు నిర్వహించారు. ప్రతి విద్యార్థి ఓటు హక్కు ప్రాధాన్యతను ఇంట్లోని తల్లిదండ్రులతో పాటు ఇరుగుపొరుగు వారికి వివరించారని సూచించారు.

• రాయల్ డిగ్రీ కళాశాలలో వ్యాసరచన పోటీలు…
అలాగే ఐడిపిఎల్ లోని రాయల్ డిగ్రీ కళాశాలలో ఓటు హక్కు పై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఆర్వో సునీత, ఎన్నికల సూపరింటెండెంట్ గిరిబాబు, జోనల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది, పౌరులు పాల్గొన్నారు.