మహా రక్తదాన శిబిరానికి విశేష స్పందన
• పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శిబిరాన్ని ఏర్పాటుచేసిన జీడిమెట్ల పోలీసులు
• 410 మంది రక్తదాతలతో విజయవంతమైన కార్యక్రమం
• మూడేళ్ల చిన్నారి ప్రాణాలను నిలబెట్టిన రక్తదాన శిబిరం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 18:
పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జీడిమెట్ల పోలీస్స్టేషన్లో శనివారం నిర్వహించిన మహా రక్తదాన శిబిరానికి అద్భుత స్పందన లభించింది. పోలీసుల పిలుపు మేరకు స్పందించి వందలాది మంది జీడిమెట్ల పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, కార్మికులు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు, ప్రజలు, యువత ముందుకొచ్చి రక్తదానం చేశారు.

• రక్త దాతలకు హెల్మెట్ల బహుకరణ…
రక్త దాతలకు ప్రత్యేక ప్రోత్సాహంగా ఈక్విటాస్, రామరాజు ఆసుపత్రి, వ్యాక్సన్ పాఠశాలలు సమకూర్చిన హెల్మెట్లను జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేశ్ బహూకరించారు. సుమారు 300 మంది రక్త దాతలకు ఉచితంగా హెల్మెట్లు అందించారు.
ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్తదానం ఎంత అవసరమో, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను రక్షించుకునేందుకు హెల్మెట్ కూడా అంతే అవసరం అని ఇన్స్పెక్టర్ మల్లేశ్ పేర్కొన్నారు.
అంతకుముందు ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా బాలానగర్ ఏసీపీ నరేశ్ రెడ్డి హాజరై ప్రారంభి, అనంతరం రక్తదాతలను అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు.

• మూడేళ్ల చిన్నారి ప్రాణాలను నిలబెట్టిన శిబిరం…
ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్న సమయంలో సుచిత్రలోని రష్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స పొందుతున్న మూడేళ్ల చిన్నారికి ‘ఏ నెగటివ్’ రక్తం అత్యవసరంగా కావాల్సి వచ్చింది. దీంతో విషయం తెలిసిన వెంటనే మహా రక్తదాన శిబిరం నుంచి ఇద్దరు దాతలను పోలీసులు పంపించారు. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు గట్టెక్కడంతో ప్రతి ఒక్కరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొత్తం 410 మంది రక్తదాతలు స్వయంగా ఇచ్చిన రక్తాన్ని పంజాగుట్ట నిమ్స్ బ్లడ్ బ్యాంక్, తలసేమియా, సికిల్ సెల్ సొసైటీలకు అందజేశారు. ఈ రక్తదాన శిబిరంలో నిమ్స్ బ్లడ్ బ్యాంక్ వైద్యులు కార్య దీక్ష, టెక్నికల్ అధికారి బిడుగు శేఖర్, డీఐ ధనుంజయ్, ఎస్సైలు నాయుడు, సత్యనారాయణ, శ్యామ్బాబు, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ వేద ప్రకాష్, అధ్యక్షులు జమీల్ హైమద్, ఉపాధ్యక్షులు పర్ష వెంకట రమణ, శైలేష్ గుప్తా, తల, సికిల్ సెల్ సొసైటీ సిబ్బంది, జీడిమెట్ల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.