హెచ్ఎంటి పరిశ్రమకు పూర్వ వైభవం కల్పిస్తాం
✓ చింతల్ లోని హెచ్ఎంటీ పరిశ్రమను సందర్శించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు
✓ దేశానికే తలమానికమైన పరిశ్రమ నేడు దీనస్థితిలో ఉందని వ్యాఖ్య
✓ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖల్లో ఆదే పరిస్థితి
✓ త్వరలోనే పునరుద్ధరనకు కృషి చేస్తామని హామీ
✓ హెచ్ఎంటీ భూకబ్జాలపై కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 23: హెచ్ఎంటీ (హిందూస్థాన్ మెషిన్ టూల్స్) పరిశ్రమ దేశానికే తల మానికం అని, ప్రస్తుతం హెచ్ఎంటీ దీనస్థితిలో ఉందని, పరిశ్రమకు పూర్వ వైభవం తెచ్చేందుకు సాయశక్తులా కృషి చేస్తామని హెచ్ఎంటి తెలంగాణ ఎంప్లాయిస్ యూనియన్ చీఫ్ పాట్రన్, మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు అన్నారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ. కుమారస్వామితో సమస్యలపై చర్చించి పరిశ్రమ పూర్వ పూర్వ వైభవం తెచ్చేందుకు ముందుకెళ్తామని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ లోని హెచ్ఎంటీ పరిశ్రమను ఆయన గురువారం సందర్శించారు.

బెంగుళూరులో 1953వ సంవత్సరంలో స్థాపించినప్పటి నుంచి అత్యుత్తమ ఉత్పత్తుల తయారీతో వెలుగొంది, దేశ వ్యాప్తంగా ఆరు శాఖలకు విస్తరించి ఎంతో మందికి ఉపాధి కల్పించిందని ఆయన కొనియాడారు. ఆటువంటి పరిశ్రమ ప్రస్తుతం నిస్తేజంగా మారి మూతపడే స్థితి చేరిందని, అందులో పని చేసే కార్మికులు, వారి కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని హెచ్ఎంటీ శాఖల్లో ఊహించిన స్థాయిలో ఉత్పత్తి లేక దీనస్థితి రాజ్యమేలుతుందన్నారు. పరిశ్రమలో పని చేసే కొందరు ఉద్యోగులు, సిబ్బంది దీనస్థితిలో ఉన్న హెచ్ఎంటీని వృద్ధిలోకి తీసుకు రావడానికి సమస్యల పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ ఇప్పటికీ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. హెచ్ఎంటీ పరిశ్రమను పునర్ వ్యవస్థీకరణ కోసం అధికారుల నుంచి నివేదికలు తీసుకొని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నామని, దానికి కొంత సమయం కావాలన్నారు. ప్రస్తుతం మనగడలో ఉన్న ఇతర కేంద్ర ప్రభుత్వారంగా పరిశ్రమలతో గానీ, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలతో గాని హెచ్ఎంటి పరిశ్రమను అనుసంధానం చేసే విధంగా సమాలోచనలు జరుపుతున్నామని ఆయన తెలిపారు.

హెచ్ఎంటీ భూకబ్జాలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాటి పరిరక్షణ కోసం చర్చించామని, రక్షణ సిబ్బందికి సూచనలు చేశామని, త్వరలోనే వాటిని కూడా సంబంధిత రెవెన్యూ, జిహెచ్ఎంసి అధికారులతో సమన్వయంతో నిర్మూలిస్తామని, కొన్ని భూవివాదాలు కోర్టు పరిధిలో ఉన్నాయన్నారు.1964 సంవత్సరంలో చింతల్లో 888 ఎకరాల్లో ప్రారంభమైన పరిశ్రమ స్థలాల్లో కొంత స్థలాన్ని ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలకు లీజుకు ఇచ్చారని, మిగిలిన స్థలాన్ని ఇటీవల డిజిటల్ సర్వే కూడా అధికారులు చేశారన్నారు. దాని ప్రకారం పరిశ్రమకు సంబంధించిన స్థలాన్ని కాపాడుతామన్నారు. అంతకుముందు పరిపాలన విభాగ నాలుగవ అంతస్తులో అధికారులు, సిబ్బందితో సమాలోచన సమావేశాన్ని ఆయన నిర్వహించారు.

• ఆపరిష్కృత కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం…
గత కొన్ని సంవత్సరాలుగా ఆపరిష్కృతంగా ఉన్న హెచ్ఎంటీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి అండగా నిలుస్తానన్నారు. హెచ్ఎంటీ ఉద్యోగులకు 1992 నుంచి చెల్లించాల్సిన వివిధ రకాల బకాయిలను, ఉద్యోగులకు అందాల్సిన పీఎఫ్, ఈఎల్ నగదును వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి భరత సింహారెడ్డి, బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి నల్లా జయశంకర్ గౌడ్, బిజెపి నాయకులు పులి బలరాం, సతీష్, కంది శ్రీరాములు, హెచ్ఎంటి ఉద్యోగులు మాదన్న,
ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, గిరిధర్, సుబ్బరాజు, లక్ష్మణ్ జీ తదితరులు పాల్గొన్నారు.