జహీరాబాద్ (న్యూస్ విధాత్రి), మార్చి 10: విద్యార్థులు విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ పూర్ (హెచ్ హెచ్4పి) స్వచ్ఛంద సంస్థ మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. సంస్థ ఆధ్వర్యంలో న్యాల్కల్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ మీర్జాపుర (బి) పాఠశాల, జహీరాబాద్ మండలంలోని అల్గోల్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల కోసం అవసరమైన పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 98 మంది పదవ తరగతి విద్యార్థులకు సుమారు రూ.15 వేల విలువైన ఎగ్జామ్ ప్యాడ్లు, జామెంట్రీ బాక్స్లు, పెన్నులు అందజేశారు.
రాబోయే బోర్డు పరీక్షలకు ఈ కిట్లు విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. పేద, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా సమాన అవకాశాలు పొందాలని తమ సంస్థ ఎప్పటి నుంచో కృషి చేస్తోందని సంస్థ సభ్యులు పేర్కొన్నారు. పరీక్షల సమయంలో అవసరమైన సామగ్రి అందుబాటులో లేక ఇబ్బందులు పడే విద్యార్థులకు ఈ పరీక్ష కిట్లు ఉపయోగపడతాయని చెప్పారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల అభివృద్ధికి సంస్థ మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. రాజ్ కుమార్, హెచ్.ఎం ఉమారాణి, సంస్థ సభ్యులు వెంకట్ రాంరెడ్డి, సందీప్ ముదిరాజ్, చేతన్ చించోలి, ధన్నారం కార్తీక్, రవి కుమార్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.