ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఘన నివాళులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 21: తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేసిన మహోన్నత ఉద్యమ నేత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ లోని రామకృష్ణ నగర్ జయశంకర్ చౌరస్తాలో అన్న ఆయన విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1952 నుంచి తన చివరి శ్వాస వరకు మూడు దశల ఉద్యమాల్లో ప్రొఫెసర్ జయశంకర్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్తగా సేవలందించిన జయశంకర్, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యంగా నదీ జలాల అసమాన పంపిణీపై ఆయన చేసిన లోతైన అధ్యయనం తెలంగాణ ఉద్యమానికి బలమైన సిద్ధాంతపరమైన పునాది వేసిందని నాయకులు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్తో పాటు పార్టీ నాయకులు యాదగిరి, కిషోర్ చారి, సత్తిరెడ్డి, నజీర్, రాకేష్, దిలీప్, ఉమేష్, ఆంజనేయులు, రమణారెడ్డి, వెంకటేష్, అజయ్, రవీందర్, గంగాధర్, సతీష్, పోచయ్య, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.