పేరుగాంచిన చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

• రూ.5 లక్షల విలువైన ఆస్తి స్వాధీనం
• నలుగురు నిందితులు పట్టివేత
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మే 30: ఉదయం వాకింగ్‌కు వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లు, దోపిడీలకు పాల్పడుతున్న ఒక పేరుగాంచిన ముఠాను జీడిమెట్ల పోలీసులు, సీసీఎస్ కుత్బుల్లాపూర్ పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టి అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు చెందిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు గొలుసు, మొబైల్ ఫోన్, ద్విచక్ర వాహనం, ఆటోరిక్షా (TG34T3931) ను స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుత్బుల్లాపూర్ జోన్ డిసిపి కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…చింతల్‌కు చెందిన శ్రీలత ఈ నెల 26వ తేదీన జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదే రోజు ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో బీరప్పనగర్ నుంచి కుత్బుల్లాపూర్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా జీహెచ్‌ఎంసీ కార్యాలయం సమీపంలో ఒక ఆటోరిక్షా ఆగిందని, అందులో ఉన్న వ్యక్తి తన మెడలోని రెండు తులాల బంగారు గొలుసు, మొబైల్ ఫోన్‌ను బలవంతంగా లాక్కొన్నాడని పేర్కొన్నారు. అడ్డుకోవడానికి ప్రయత్నించగా తనపై దాడి చేసి గాయపరిచినట్లు ఫిర్యాదులో తెలిపారు. అనంతరం నిందితులు ఆటోలో కుత్బుల్లాపూర్ వైపు పరారయ్యారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీఎస్ కుత్బుల్లాపూర్, జీడిమెట్ల క్రైమ్ టీమ్‌లతో కలిసి ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలం, నిందితులు పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, డిజిటల్ ఆధారాలు, పాత నేర చరిత్రలను విశ్లేషించారు. దర్యాప్తులో భాగంగా నేరానికి ఉపయోగించిన ఆటోరిక్షా ఆధారంగా నిందితులను గుర్తించి, జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండలోని సిక్కు బస్తీలో అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితులు ప్రతిరోజూ సాయంత్రం సమావేశమై మత్తు పదార్థాలు సేవించిన అనంతరం వివిధ ప్రాంతాల నుంచి ఆటోరిక్షాలను దొంగిలించి నగరంలో తిరుగుతూ మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లు, దోపిడీలు, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా దుండిగల్, కుత్బుల్లాపూర్, చింతల్, హెచ్‌ఎంటీ అటవీ ప్రాంతం, కేపీహెచ్‌బీ కాలనీ తదితర ప్రాంతాల్లో వీరు పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన నిందితులు గోవింద్ సింగ్ అలియాస్ థాంక్ గోవింద్ సింగ్ (24), కరణ్ సింగ్ అలియాస్ బురాని కరణ్ సింగ్ (21), హర్దీప్ సింగ్ అలియాస్ బురాని హర్దీప్ సింగ్ (19)తో పాటు ఒక బాల నేరస్తుడు ఉన్నాడు. వీరంతా జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండ సిక్కు బస్తీకి చెందినవారు. వీరిపై గతంలో కూడా వివిధ పోలీసు స్టేషన్లలో పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును కుత్బుల్లాపూర్ డివిజన్ ఏసీపీ ఎ.సి. బాల గంగిరెడ్డి, సీసీఎస్ ఏసీపీ జి. నాగేశ్వరరావు పర్యవేక్షణలో జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ జి. మల్లేష్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ దాలి నాయుడు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ధనుంజయ, జీడిమెట్ల డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్. శ్యాంబాబు, జీడిమెట్ల కానిస్టేబుళ్లు నరేష్, సుబ్బారాయుడు, ఎల్. మోహన్, రాజ్ కుమార్, సుబ్బారావు , సీసీఎస్ కుత్బుల్లాపూర్ కానిస్టేబుళ్లు ప్రవీణ్, సురేష్, రాజశేఖర్, మహిపాల్ రెడ్డి, పోలీసు బృందం విజయవంతంగా ఛేదించింది. కేసు ఛేదనలో విశేష కృషి చేసిన అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More