ప్రభుత్వ నిధుల కేటాయింపులకు ఖచ్చితమైన జనగణన గణాంకాలు ఎంతో కీలకం. – డిసి
• జీడిమెట్ల సర్కిల్లో సెన్సస్ హౌస్ లిస్టింగ్ పనులపై సమీక్షా సమావేశం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మే 22: కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని జీడిమెట్ల సర్కిల్ కార్యాలయంలో ఈ రోజు సెన్సస్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సెన్సస్ చార్జ్ ఆఫీసర్, ఉప కమిషనర్ శంకర్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జన గణన సూపర్వైజర్లతో ప్రస్తుత సర్వే పనుల పురోగతిని సమగ్రంగా సమీక్షించి, క్షేత్రస్థాయిలో సర్వే పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ తమ పరిధిలోని ప్రతి ఇంటిని గడువులోగా 100 శాతం నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. జనగణన ప్రాముఖ్యతను వివరిస్తూ, వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్ ప్రాంతంలో విద్య, వైద్యం, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ నిధుల కేటాయింపులకు ఖచ్చితమైన జనగణన గణాంకాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. అలాగే సర్వేలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో పాటు, డేటా విశ్వసనీయతను కాపాడాలని సూచించారు. ప్రజల వ్యక్తిగత సమాచార గోప్యతకు ఎలాంటి భంగం కలగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూపర్వైజర్లకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో జనగణన సూపర్వైజర్లు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.