ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది స్థానిక పోలీసులతో సమన్వయంతో పనిచేయాలి. – డిసిపి కోటిరెడ్డి
• కుత్బుల్లాపూర్ జోన్లో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి పోలీసుల అవగాహన కార్యక్రమం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 27: ప్రతి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ, సెక్యూరిటీ గార్డు చట్టంలోని నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ స్థానిక పోలీసులతో సమన్వయంతో పనిచేయాలని కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ జోనల్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ విక్రేతలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 300 మంది హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ..నేరాల నియంత్రణలో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది, సీసీటీవీ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ యాక్ట్–2005 (పిఎస్ఏఆర్ యాక్ట్ –2005) ప్రకారం ప్రతి సెక్యూరిటీ ఏజెన్సీ తప్పనిసరిగా నమోదు చేసుకుని నిబంధనలను పాటించాలని సూచించారు. సందర్శకుల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయడం, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడం, ప్రవేశ–నిష్క్రమణ ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలు ఎప్పటికప్పుడు పనిచేసేలా చూడడం, అత్యవసర పరిస్థితులు, శాంతిభద్రతల నిర్వహణ, వీఐపీ బందోబస్తు సమయంలో పోలీసులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. అనంతరం పిఎస్ఏఆర్ యాక్ట్ –2005లోని నిబంధనలను వాస్తవ ఘటనల ఉదాహరణలతో సవివరంగా అధికారులు వివరించారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా సెక్యూరిటీ సిబ్బందిలో చట్టాలపై అవగాహన పెంపొందించి, నేర నియంత్రణలో పోలీసులకు మరింత సమర్థవంతమైన సహకారం అందేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ పురుషోత్తం, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఏసీపీ బాల గంగిరెడ్డి, జోన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, డీఐలు పాల్గొన్నారు.