వైభవంగా శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
సూరారం (న్యూస్ విధాత్రి), ఏప్రిల్ 9: స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీలో గురువారం భక్తి భావాలతో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. కాలనీలోని సంక్షేమ సంఘ భవన ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు, స్థానికులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ మహాలక్ష్మి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు తెల్లవారుజామునే ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటల నుంచే వేద మంత్రోచ్చారణల మధ్య పూజారులు శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం హోమాలు, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా, ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో మార్మోగింది. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహిళలు సంప్రదాయ వేషధారణలో పాల్గొని బోనాలు, పూజా సామగ్రితో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు సురేశ్బాబు, యాదిరెడ్డి, సుబ్బారావు, చంద్రశేఖర్, లక్ష్మారెడ్డి, వెంకట్రెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాలనీవాసులు సమిష్టిగా పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. ఈ వేడుకతో శ్రీరామ్ నగర్ కాలనీ అంతటా పండుగ వాతావరణం నెలకొంది.