మహానగర్ కాలనీలో మురుగు పరుగు…
• కాలనీలో నెలకొన్న తీవ్ర డ్రైనేజీ సమస్య
• పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం
• వెంటనే పరిష్కరించాలని కోరుతున్న స్థానికులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 11: జీడిమెట్ల డివిజన్ పరిధిలోని మహానగర్ కాలనీలో గత కొంతకాలంగా మురుగు పొంగిపొర్లుతున్న డ్రైనేజీ సమస్య స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పక్కనే ఉన్న రుక్మిణి ఎస్టేట్ ప్రాంతం నుంచి వచ్చే మురుగునీరు మ్యాన్ హోల్ నుంచి పొంగిపొర్లుతూ మహానగర్ కాలనీ రోడ్లలోకి చేరడంతో కాలనీలోని ప్రధాన వీధులు మురుగునీటితో నిండిపోయాయి. ముఖ్యంగా కాలనీలోని దేవాలయం ముందు పెద్ద ఎత్తున మురుగునీరు నిల్వ ఉండటంతో భక్తులు ఆలయానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే స్థానిక నివాసుల ఇళ్ల ముందు వరకు మురుగునీరు చేరుకోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే కష్టాలు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నడవలేని పరిస్థితి ఏర్పడింది. మురుగునీరు నిల్వ ఉండటంతో దుర్వాసన వ్యాపించి పరిసర ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసే పరిస్థితుల్లో సమస్య మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఫోన్ ద్వారా సమాచారం అందించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. అధికారులు నిర్లక్ష్య వైఖరి వీడి వెంటనే స్పందించాలని వారు కోరుతున్నారు. ఈ సందర్భంగా మహానగర్ కాలనీ అధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ… రుక్మిణి ఎస్టేట్ నుంచి వస్తున్న డ్రైనేజీ నీరు తమ కాలనీ దేవాలయం ముందు నిలిచిపోవడంతో పాటు స్థానికుల ఇళ్ల ముందు కూడా చేరుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. డ్రైనేజీ వ్యవస్థను సమగ్రంగా పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.