• 10 మంది అధికారులు, సిబ్బందికి స్థానచలనం.. అదనపు బాధ్యతలు
• తక్షణమే అమల్లోకి వచ్చిన బదిలీ, పోస్టింగ్ ఉత్తర్వులు
హైదరాబాద్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 11: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టౌన్ ప్లానింగ్ విభాగం సమర్థవంతమైన నిర్వహణ, పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు అధికారులు, సిబ్బందికి బదిలీలు, పోస్టింగ్లు, అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్ జి. సృజన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
• ఉత్తర్వుల ప్రకారం…
శేరిలింగంపల్లి సర్కిల్ ఎసిపిగా విధులు నిర్వహిస్తున్న ఈ. సురేందర్ రెడ్డిని, జీడిమెట్ల ఏసీపీగా బదిలీ చేశారు. జీడిమెట్ల, కొంపల్లి సర్కిళ్ల ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న టి.రాణిని పటాన్చెరు ఏసీపీగా బదిలీ చేసి, అమీన్పూర్ అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. నార్సింగి సర్కిల్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న ప్రసీధకు శేరిలింగంపల్లి ఏసీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం పటాన్చెరుకు ఉన్న అదనపు బాధ్యతల నుంచి ఆమెను రిలీవ్ చేశారు. అమీన్పూర్ సర్కిల్ టీపీవో (ఇన్చార్జి ఏసీపీ) ప్రసాద్ ను కొంపల్లి ఇన్చార్జి ఏసీపీగా బదిలీ చేశారు. జీడిమెట్ల, కొంపల్లి సర్కిల్ల టిపిఎస్ గా విధులు నిర్వహిస్తున్న బి. మచ్చేందర్ ను మాదాపూర్ టీపీఎస్గా బదిలీ చేయడంతో పాటు ఆల్విన్ కాలనీ సర్కిల్ టీపీఎస్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. చింతల్ సర్కిల్ టిపిఎస్ గా విధులు నిర్వహిస్తున్న పి. మధుకు తన సాధారణ విధులతో పాటు జీడిమెట్ల సర్కిల్ టీపీఎస్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. గాజులరామారం సర్కిల్ టిపిఎస్ గా విధులు నిర్వహిస్తున్న బి. సరిత సేన్ కు కొంపల్లి టీపీఎస్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. నిజాంపేట, దుండిగల్ సర్కిల్ల టిపిఎస్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్. ముఖేష్ సింగ్ ను మేడ్చల్ టీపీఎస్గా బదిలీ చేశారు. మేడ్చల్ సర్కిల్లో విధులు నిర్వహిస్తున్న జి. సాయి తేజను నిజాంపేట్కు బదిలీ చేసి, దుండిగల్ సర్కిల్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. నార్సింగి, పటాన్ చెరువు సర్కిళ్లలో టిపిఎస్ గా విధులు నిర్వహిస్తున్న పి. రమేష్ కు అదనంగా అమీన్పూర్ సర్కిల్ టిపిఎస్ బాధ్యతలు అప్పగించారు. అమీన్పూర్ సర్కిల్ కు చెందిన టీపీవో రోహన్ ఠాకూర్ వైద్య సెలవులో ఉన్న నేపథ్యంలో ఆయన తిరిగి విధుల్లో చేరే వరకు ఈ అదనపు బాధ్యతలు కొనసాగనున్నాయి. బదిలీ, పోస్టింగ్ పొందిన అధికారులు తమకు కేటాయించిన పోస్టుల్లో వెంటనే బాధ్యతలు స్వీకరించి, చార్జ్ స్వీకరణ నివేదికలను చీఫ్ సిటీ ప్లానర్ ద్వారా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.